Revanth Reddy Unstoppable: పేదల ఇళ్లను కూల్చివేయడంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా రేవంత్‌ రెడ్డి అదే దూకుడుతో ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా తనను విమర్శిస్తున్న ప్రజలపైకి రేవంత్‌ ఎదురుదాడి చేశారు. డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై మండిపడ్డారు. పేదల దుఃఖం తనకు తెలుసని.. పేదవాడి కన్నీళ్లు చూడలని తాము కోరుకోవడం లేదని పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Digital Card: 'ఒక రాష్ట్రం-ఒక కార్డు'తో ప్రజలకు 30 రకాల సేవలు: రేవంత్‌ రెడ్డి


 


కుటుంబ గుర్తింపు, కుటుంబ డిజిటల్​ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించిన అనంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. 'హైదరాబాద్ నగరాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నాం. కిరాయి మనుషులతో మీరు చేసే హడావుడి తెలంగాణ సమాజం గమనిస్తోంది. ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. మూసీ మురికిలో బ్రతుకుతున్న పేదలకు ఇళ్లు ఇచ్చి, రూ.25 వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Also Read: Konda Surekha: క్షమాపణలు చెప్పని కొండా సురేఖ.. కానీ 'ఆ కామెంట్లు' వెనక్కి తీసుకున్న మంత్రి


 


'మీ ఫామ్ హౌస్‌లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారు. కేటీఆర్ అక్రమంగా నిర్మించిన మీ ఫామ్ హౌజులు కూల్చాలా వద్దా? సబితమ్మ ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. వాటిని కూలగొట్టాలా వద్దా?' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఫామ్ హౌసులు కూలుతాయనే పేదలను అడ్డు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. 'నల్లచెరువులో, మూసీ నది ఒడ్డున ప్లాట్లు చేసి అమ్మింది మీ పార్టీ నాయకులు కాదా?' అని నిలదీశారు.


'నేను 20 ఏళ్లు ప్రజల్లో తిరిగినవాడిని. నాకు పేద ప్రజల కష్టాలు తెలియదా? మూసీని అడ్డు పెట్టుకుని ఎంతకాలం తప్పించుకుంటారు? జవహర్ నగర్‌లో వెయ్యి ఎకరాలు ఉంది. రండి పేదలకు పంచి ఇందిరమ్మ ఇండ్లు కట్టిద్దాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 'ఇక్కడి ఎంపీ మోడీ దగ్గర నుంచి ఏం తీసుకొస్తారో చెప్పాలి. సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయొచ్చు. కానీ మూసీని అభివృద్ధి చెయ్యొద్దా ఈటలా? కేటీఆర్, హరీశ్‌ రావు మాట్లాడిన జిరాక్స్ కాపీ తీసుకుని ఈటెల మాట్లాడుతున్నారు. పార్టీ మారినా ఈటలకు పాత వాసనలు పోలేదు' అని విమర్శించారు.


'మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు ఇండ్లు తీసుకురావడానికి మోదీ దగ్గరకు వెళదాం రండి. నాకు రావడానికి ఎలాంటి భేషజాలు లేవు. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా. నగరంలో చెరువుల లెక్క, ఆక్రమణల లెక్క తీద్దాం రండి. వందలాది గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో వరదలు వచ్చి లక్షలాది కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఇప్పటికే చెరువులు, నాళాలు మూసుకుపోయాయిఇలాగే చూస్తే, ఇంకొన్నాళ్లకు మూసీ కూడా మూసుకుపోతుంది' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.


'పేదల దుఃఖం నాకు తెలుసు. పేదవాడి కన్నీళ్లు చూడలని మేం కోరుకోవడంలేదు. ప్రతీ పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించడమే మా ప్రభుత్వ ఉద్దేశం. చెరువులు, నాళాలు, మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందే పేదలకు ఎలా న్యాయం చేద్దామో మీరు అది చెప్పండి. మీ పదేళ్ల పాలన దోపిడీకే పనికి వస్తుందా? పదేళ్లు పాలించామని, అనుభవం ఉందని చెబుతున్న వాళ్లు పేదలకు ఏం చేద్దామో చెప్పండి' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. 'మొత్తం మంత్రివర్గాన్ని తీసుకువస్తా.. ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లి ఈటెల రూ.25వేల కోట్లు నిధులు ఇప్పించగలరా?' అని ఈటల రాజేందర్‌కు సవాల్‌ విసిరారు.


'మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరం లేదు. రాజకీయాల కోసం మూసీ ప్రాజెక్టు చేపట్టలేదు. హైదరాబాద్ భవిష్యత్ కోసమే మేం ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. సంచులు తీసుకున్నవాళ్లకే సంచుల గురించి తెలుస్తది. ఇండ్లు తొలగిస్తే ఎవరైనా సంచులు ఇస్తారా? తిట్లు తప్ప. దోపిడీ సొమ్ముతో కేటీఆర్ అడ్డగోలు పనులు చేస్తే ప్రజలు క్షమించరు' అని ముఖ్యమంత్రి తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి